విజయ్ మాల్యా ఉరేస్తున్నారు
Published: Tuesday July 10, 2018

ఓట్ల కోసం భారత ప్రభుత్వం తనను శిలువ వేసి ఉరి తీయాలనుకొంటోందని లిక్కర్ వ్యాపారి, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా ఆరోపించారు. బ్యాంకులకు దాదాపు 9380 కోట్ల రూపాయల రుణం ఎగవేసిన నేరంపై దేశం నుంచి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్న మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత్ విశ్వప్రయత్నాలు చేస్తున్న దశలో ఆయన ఈ ఆరోపణ చేయడం విశేషం. మాల్యాను ఆర్థిక నేరగాడికి ప్రకటించిన భారత్- ఆయనను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుండడమే కాక- ఆయన ఆస్తులను జప్తు చేయాలని కూడా కోరుతోంది.
‘‘లండన్లో నా ఆస్తుల స్వాధీనానికి బ్రిటిష్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఎప్పుడో 1920ల్లోనే మా నాన్న నాకు రాసిన ఆస్తులూ తీసేసుకుంటున్నారు. ఇక ఇంట్లో ఉన్న కొద్దిపాటి నగలు, కార్లు జప్తు చేస్తారు. మీరెందుకు శ్రమ తీసుకొని రావడం? నేనే వచ్చి అందజేస్తానని బ్రిటిష్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చెప్పాను’’ అని మాల్యా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వ్యూహాత్మకంగానే మాల్యా తన విలాసవంతమైన భవనాన్ని తన తల్లి పేరిట పెట్టారు. లండన్ శివార్లలోని మరో నాలుగిళ్లు పిల్లల పేరిట ఉన్నాయి. ‘‘భారత బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం నా 13,900 కోట్ల రూపాయల మేర ఆస్తుల్ని కుదువపెట్టాను. బ్యాంకులతో నా లావాదేవీలన్నీ సెటిల్ చేసేస్తాను. రాజకీయ అవసరాల కోసం భారత ప్రభుత్వం నన్ను వెంటాడుతోంది. ఇది ఎన్నికల సంవత్సరం. నన్ను భారత్కు రప్పించి శిలువపై ఉరి తీస్తే ఓట్లు రాలతాయన్నది వారి ఆశ’’ అని ఆయన ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు
