మిర్చి యార్డు, స్పైసెస్ బోర్డు ప్రత్యేక చొరవ
Published: Monday July 02, 2018

అంతర్జాతీయ మార్కెట్లోకి గుంటూరు మిర్చి ఎగుమతులకు చర్యలు మొదలయ్యాయి. శాశ్వత ప్రాతిపదికపై రైతులకు మేలు జరిగే ఈ పథకానికి గుంటూరు మిర్చి యార్డు కేంద్ర బిందువుగా ఉంది. స్పైసెస్ బోర్డు, ఉద్యానవన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు, అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులను పరిశీలించే గ్లోబల్ గ్యాప్ సంస్థలు, స్పైసెస్ పార్కు, నాబార్డు, వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 3న ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి గ్లోబల్ జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) అనే సంస్థ ధృవీకరణ పత్రాలు ఇస్తుంది.
ఈ సంస్థ రైతులకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే సుమారు ఏడాది పాటు పర్యవేక్షిస్తుంది. గత ఏడాది గుంటూరు స్పైసెస్ బోర్డు ద్వారా మన దేశంలో మొదటిసారి 660 మంది రైతులకు గ్లోబల్ గ్యాప్ సర్టిఫికెట్లు ఇప్పించారు. దీనిలో 620 మంది మిర్చి రైతులు, 40 మంది కరివేపాకు రైతులు ఉన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 620 మంది మిర్చి రైతులు గ్లోబల్ గ్యాప్ సర్టిఫికెట్లతో ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి అమ్మకాలు చేపట్టారు. ఫలితంగా స్థానికంగా గుంటూరు యార్డులో ఉన్న ధర కంటే 2-3 రెట్లు ఎక్కువగా వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకొని మిర్చి రైతుల శాశ్వత ప్రయోజనాల కోసం గుంటూరు యార్డు పాలకవర్గం ఒక అడుగు ముందుకు వేసింది.
