పవన్ కల్యాణ్ అభిమానులను హెచ్చరించిన రేణూదేశాయ్
Published: Friday June 29, 2018

పవన్ కల్యాణ్తో విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పానంటే ఆయన అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని జనసేన అధిపతి మాజీ భార్య రేణూ దేశాయ్ హెచ్చరించారు. ఇన్నేళ్లుగా విడాకుల వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నందుకు ఆయన అభిమానులు కృతజ్ఞులుగా ఉండాలని వ్యాఖ్యానించారు. తాను నోరు తెరచి, విడాకుల వెనుక వాస్తవాలను చెబితే అవివేకులైన, మర్యాద తెలియని అభిమానులకు గర్వభంగం అవుతుందని చెప్పారు. గురువారం ఆమె ఇన్స్టాగ్రాంలో తనను ట్రోల్ చేస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన ఇన్స్టాగ్రాం ఖాతాలోకి ప్రవేశించి ఏడుపు గొట్టు కథలు చెప్పే అధికారం పవన్ కల్యాణ్ అభిమానులకు లేదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు.
‘‘నేనేమన్నా మీ సోషల్ మీడియా ఖాతాల్లోకి వచ్చి కామెంట్లు చేస్తున్నానా?’’ అని నిలదీశారు. పవన్ కల్యాణ్ అభిమానుల నెగటివిటీని తానెందుకు భరించాలని ప్రశ్నించారు. వాళ్ల నెగటివిటినీ భరించాల్సినంత తప్పు తానేం చేశానని అడిగారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అపరిపక్వత ఎలా అవుతుందని నిలదీశారు. ఇకనైనా తన ఇన్స్టాగ్రాంలోకి వచ్చి సలహాలు ఇవ్వడం ఆపేయాలని కోరారు. ‘‘అభిమానుల అవధుల్లేని మూర్ఖత్వానికి తెరపడి నేను స్వేచ్ఛగా సోషల్ మీడియాను తెరిచి నా గురించి, నా పని గురించి కామెంట్లు చదువుకొనే రోజు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చెప్పారు.
