త్రుటిలో తప్పిన ప్రమాదం

Published: Friday June 15, 2018
 పాడేరు ఘాట్‌ మార్గంలో గురువారం ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బయలుదేరింది. ఆ బస్సు పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాపురం దాటిన తర్వాత బ్రేకులు సరిగా లేకపోవడంతో అదుపు తప్పేలా ఉండటంతో డ్రైవర్‌ అప్రమత్తమయ్యాడు. క్రమంగా వేగాన్ని నియంత్రిస్తుండగా పన్నెండోమైలు గ్రామానికి సమీపంలోని కుడి వైపు ఘాట్‌ రక్షణ గోడను బస్సు ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
 
 
రక్షణ గోడను ఢీకొట్టి ఆగిన బస్సు, దురదృష్టవశాత్తూ లోయలోకి దూసుకుపోతే పెద్దప్రమాదమే జరిగేదని ప్రయాణికులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులు మైదాన ప్రాంతం వైపు ఉన్న ఇతర వాహనాల్లో తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఘాట్‌ మార్గంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టిన క్రమంలో బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ఘాట్‌లో సుమారుగా రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు డ్రైవర్ల సహాయంతో ఒక లారీకి బస్సును కట్టి రక్షణగోడ నుంచి బయటకు తీశారు.