ఏడాదిన్నరగా బాలుడు మాయం... చివరికి మృత దేహం లభ్యం

18 నెలలుగా కనిపించకుండా పోయిన నాలుగేళ్ల జైద్ ఎప్పటికైనా తిరిగివస్తాడని భావించిన అతని కుటుంబ సభ్యుల ఆశలు అడియాసలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్లో గల షమ్షాద్ గార్డెన్లో ఉంటున్న నజర్ మొహమ్మద్ కుమార్తె నిన్న సాయంత్రం డాబా శుబ్రం చేసేందుకు వెళ్లింది. ఈ నేపధ్యంలో ఆమెకు పక్కనేవున్న బిల్డింగ్ డాబాపై తెరిచివున్న ఒక బాక్సు కనిపించింది. దానిలో ఎప్పుడో అదృశ్యమైన తన సోదరుడు జైద్ మృతదేహం ఉంది. వెంటనే ఆమె కిందకు వచ్చి ఈ సంగతిని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు స్కూలు డ్రెస్ ఆధారంగా జైద్ను గుర్తుపట్టి ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. నర్సరీ చదువుతున్న జైద్ 2016 డిసెంబరు 1 న సాయంత్రం ఆడుకోవడానికని వెళ్లి మాయమయ్యాడు. 2వ తేదీన జైద్ కుటుంబ సభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే జైద్ను కిడ్నాప్ చేశామని, డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తూ, అతని తండ్రికి బెదరింపు ఫోన్లు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా ఆఫ్తాబ్, ఇర్ఫాన్ అనే యువకులనుఅరెస్టు చేశారు. అయితే తాము రైల్వే స్టేషన్లో ఈ బాలుడు అదృశ్యంపై ఉన్న ప్రకటన చూసి డబ్బుల కోసం ఫోన్ చేశామని చెప్పారు. ఆ తరువాత పోలీసులకు జైద్ అదృశ్యంపై ఎటువంటి వివరాలు లభ్యంకాలేదు.
