ఆకాశానికి తాకిన చికెన్ ధర

అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. కేవలం గత 15 రోజుల్లోపే కిలోకు రూ.60లు అదనంగా పెరిగింది. ప్రస్తుతం కిలో రూ.200, స్కిన్లెస్ చికెన్ రూ.220 పలుకుతోంది. మరికొన్ని రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చికెన్ ధరలు పెరగడానికి అధికమవుతున్న ఎండలు కారణమవుతున్నాయి. ఈనెల ప్రారంభం కానున్న రంజాన్ మాసం కూడా మరో కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్లకు పెరిగిన దాణా ధరలు, ఇతర ఖర్చులు కూడా చికెన్ ధరలు పెరిగేందుకు ఊతమిచ్చాయి.
తాడిపత్రి(అనంతపురం జిల్లా): జిల్లాలోని అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురం, కదిరి పట్టణాలతో పాటు మండలకేంద్రాల్లో చికెన్ విక్రయ కేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రతిరోజూ వేల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆది, మంగళవారాల్లో లక్ష కేజీలకు పైగా చికెన్ విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో గతంలో పెద్దఎత్తున కోళ్లఫారాలు ఉండేవి. ఐతే వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న దాణా ఖర్చులు, రోగాలు తదితర కారణాల వల్ల కోళ్లఫారాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణంగా కోళ్లు చల్లని వాతావరణంలోనే వృద్ధి చెందుతాయి. అనంతపురం జిల్లాలో అధిక వేడి ఉండడం వల్ల కోళ్ల ఫారాల ఏర్పాటుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఇతర కాలాల్లో సైతం ఉష్ణోగ్రతలు ఎగుడుదిగుడుగా ఉండడం వల్ల వ్యాపారులు కోళ్ల ఫారాల ఏర్పాటుకు వెనుకడుగువేస్తున్నారు. గతంలో కోళ్లఫారం వ్యాపారులు పెద్దఎత్తున నష్టపోయారు.
వాతావరణ పరిస్థితులు, రోగాల వల్ల వేలకు వేలు కోళ్లు చనిపోయి వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోవడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో డిమాండ్కు అనుగుణంగా కోళ్లఫారాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు బెంగళూరు మార్కెట్ను ఆశ్రయిస్తున్నారు. హిందూపురం, కదిరి, ధర్మవరం ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలోని కోళ్లఫారాలపై ఆధారపడుతున్నారు. జిల్లా సరిహద్దులోని కర్ణాటక ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు విస్తరించాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం కూడా అక్కడ కోళ్లఫారాలు పెరగడానికి కారణమయ్యాయి.
రంజాన్ సందర్భంగా పెరగనున్న డిమాండ్
ఈనెలలో రంజాన్ మాసం ప్రారంభం కానున్న దృష్ట్యా చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముంది. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడతారు. రోజూ దీక్షలు విరమించిన అనంతరం వారికి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తుంటారు. ఇందుకోసం చికెన్ కొనుగోళ్లు పెద్దఎత్తున జరుగుతాయి. దీంతో చికెన్కు డిమాండ్ ఏర్పడి ధరలు మరింత పెరిగే అవకాశముంది.
కోడి పిల్లల సరఫరాలోనూ జాప్యం
ధరల పెరుగుదలకు కోడి పిల్లల సరఫరాలో జాప్యమూ కారణమన్న వాదనలున్నాయి. బెంగళూరు, హైదరా బాద్లతో పాటు పలు పట్టణాల్లో ఉన్న కోళ్ళ ఫారాలకు డిమాండ్కు అనుగుణంగా కోడి పిల్లలను సరఫరా చేయడంలో వ్యాపారులు జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ జాప్యం వల్ల సకాలంలో కోళ్ళ ఉత్పత్తి జరగలేదు. దీంతో చికెన్కు డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి.
