వైన్ షాపుల్లో సిబ్బందికి దరఖాస్తుల ఆహ్వానం.
Published: Tuesday August 20, 2019

ఎక్సయిజ్ శాఖలో నూతన సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నూతన ఎక్సయిజ్ విధానంలో ప్రైవేటు మద్యం దుకాణాలు కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఏపి బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎస్బీసీఎల్)ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. విడతల వారీ మద్యం నిషేధం అమల్లో భాగంగా 20 శాతం దుకాణాలను రద్దు చేసి మిగిలిన దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా గతంలో 474 మద్యం దుకాణాలు ఉండగా 20 శాతం అంటే 95 షాపులు తగ్గించి 379 ఏపీఎస్బీసీఎల్ రిటైల్ అవుట్ లెట్స్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే తెరచి ఉంటాయి. ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు నిర్వహిస్తుండగా ఆ సమయాన్ని ఒక గంట కుదించారు. ప్రతీ దుకాణంలోను సీసీ కెమేరాలు ఉంటాయి. మద్యం షాపుల నిర్వహణకు ఇళ్ళను అద్దెకు తీసుకుంటారు. 150 నుంచి 300 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఇళ్ళను తీసుకుంటారు. ఈ దుకాణాల్లో ఫర్నిచర్ ఏర్పాటులో భాగంగా సీలింగ్ ఫ్యాన్లు, టేబుళ్ళు, కుర్చీలు, ఐరన్ ర్యాక్లు, ప్రిజ్ ధరల బోర్డులు ఉంటాయి. మద్యం కొన్నవారికి తప్పని సరిగా బిల్లులు ఇవ్వాలి. ఎమ్మార్పీకే మద్యాన్ని విక్రయించాలి.
ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటుకుగాను అద్దెకు షాపులు, షాపుల్లో ఫర్నిచర్, రవాణా సదుపాయాలకు టెండర్లు పిలిచారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు దరఖాస్తులు చేసుకోవాలని గడువు విధించారు. జిల్లాలో మూడు ఏపీఎస్బీసీఎల్ డిపోలు ఉండగా ఫర్నిచర్కు సంబంధించి ఏలూరు ఏపీఎస్బీసీఎల్ డిపోకు, రవాణాకు సంబంధించి భీమవరం, ఏలూరు ప్రాంతాల ఫరిధిలోని వారు ఏలూరు డిపోలోను, చాగల్లు డిపో పరిధిలోని వారు చాగల్లు డిపోకు టెండరు దరఖాస్తులు అందించాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక అద్దెకు షాపులు ఇచ్చే యజమానులు కూడా ఈ నెల 21వతేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా తమ రెంటల్ కొటేషన్లను ఆయా ప్రాంతాల పరిధిలోని ఎక్సయిజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలని పేర్కొన్నారు.
సిబ్బంది నియామకానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు ముగ్గురు సేల్స్మెన్లు, ఒక సూపర్వైజరు, గ్రామాల్లోని దుకాణాలకు ఇద్దరు సేల్స్మెన్లు, ఒక సూపర్వైజర్ను నియమిస్తారు. సూపర్వైజరు పోస్టుకు కనీస విద్యార్హత డిగ్రీ, బీకాం చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యం ఉంటుంది. ఇక సేల్స్మెన్ ఉద్యోగానికి ఇంటర్మీడియెట్ అర్హతగా పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 01-07-2019 నాటికి 21 సంవత్సరాలు నిండి 40 ఏళ్ల వయసు మించరాదు. జిల్లా వ్యాప్తంగా 379 సూపర్ వైజర్ పోస్టులు, 835 సేల్స్మెన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత కలిగిన వారు ఆన్లైన్లో ఈ నెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. సూపర్వైజరుకు నెలకు రూ. 17,500, సేల్స్మేన్కు రూ.15 వేలు వేతనం అందజేస్తారు. ఈ పోస్టుల భర్తీలో జిల్లా యూనిట్గా రిజర్వేషన్లును భర్తీ చేస్తారు. ఏడాది కాల వ్యవధికి ఈ పోస్టులను భర్తీ చేస్తారు. సంతృప్తికరంగా పనిచేస్తే రెండో ఏడాది వీరిని కొనసాగించే అవకాశం ఉంది.
