పడిపోయిన భూముల ధరలు
Published: Friday August 02, 2019

కియ పరిశ్రమ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ఓ ద్వితీయశ్రేణి రాజకీయ నాయకుడు ఆ పరిసర ప్రాంతాల్లో తనకున్న రెండెకరాల భూమిని ఎక్కువ ధరకు అమ్మేశాడు. ఇది ఈ ఏడాది ఆరంభం నాటి మాట. ఆ డబ్బుతో పాటు అదనంగా అరకోటి వరకు అప్పు చేసి అదే పరిసర ప్రాంతాల్లో 4.50 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అలా రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారమెత్తాడు. అయితే ఆ భూమి అమ్మేందుకు ఎంతగా ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు ఫలితం కనిపించలేదు. అయితే అప్పుగా తీసుకున్న రూ.అరకోటికి నెలనెలా వడ్డీ పెరిగిపోతోంది. అటు భూమి అమ్మలేక.. ఇటు వడ్డీ, అసలు చెల్లించలేక సతమతమయ్యాడు. చివరికి అప్పు ఇచ్చినవారికి 3.50 ఎకరాలు జమచేశాడు. ఇక అతడికి ఒక ఎకరానే మిగిలింది. దీన్ని బట్టి ప్రస్తుతం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరోగమన దిశగా సాగుతోంది. ఆకాశాన్నంటిన భూముల ధరలు ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో రోజురోజుకూ ఆందోళన పెరిగిపోతోంది. కొందరు కొనుగోలుదారులు టోకన్ అడ్వాన్స్ ఇచ్చి..ఆ తరువాత భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు తగ్గిందని ఆ వర్గాలే బహిరంగంగా పేర్కొంటున్నాయి. దీనికితోడు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తగ్గిన ఆదాయం కూడా అదే విషయం స్పష్టం చేస్తోంది.
కియ చుట్టూ తగ్గిన రియల్ జోష్..
రెండేళ్ల క్రితం కియ పరిశ్రమ సమీప ప్రాంతాలతో పాటు.. చుట్టూ 30 కిలోమీటర్ల దూరం వరకు భూములు కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గద్దల్లా వాలిపోయిన సంగతి తెలిసిందే. కియ కోసం రైతుల నుంచి ఎకరా రూ.10.50లక్షలకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కియ సమీపంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఎకరా భూమి కోసం జాతీయ రహదారి పొడవునా అయితే ఏకంగా రూ.1.50 కోట్ల నుంచి రెండు కోట్లు.. అవసరమైతే పోటీపడి మరీ మూడుకోట్ల వరకు కూడా ధర పెంచారు. ఆ మేరకు భూముల కొనుగోళ్లు జరిగాయి. జాతీయ రహదారికి అర్ధకిలోమీటర్ లోపలైతే ఎకరా రూ.కోటి వరకు కూడా చెల్లించారు. కియ పరిశ్రమకు అనుబంధంగా మరో 12 పరిశ్రమలు నెలకొల్పుతారనే సమాచారం నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత ధరయినా పెట్టి అక్కడ భూములు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. కియ పరిశ్రమ సమీపంలో ఆరునెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జోష్ తగ్గింది. మొదట్లో ఎవరైతే భూములు కొనుగోలు చేసి తిరిగి రెట్టింపు ధరకు అమ్మారో... ఆ వ్యాపారులకే లబ్ధి చేకూరింది. ఆ తరువాత కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు భూములు అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అంత ధరకు భూములు కొనలేని పరిస్థితి నెలకొనడంతో ఆ పరిసర ప్రాంతాల్లో రియల్ వ్యాపారుల జాడే కనిపించడం లేదు. ఇలా ఆ వ్యాపారం జోరు తగ్గిందనేందుకు కియ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితే నిదర్శనం.
అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలున్నాయి. ఒకటి అనంతపురం, రెండవది హిందూపురం. పార్లమెంటు స్థానాలను జిల్లాలుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు స్థానం హిందూపురాన్ని జిల్లాగా మారుస్తారని ఆ ప్రాంత ప్రజలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఆశలు రేకెత్తాయి. దీనికితోడు కొడికొండ నుంచి మడకశిరకు జాతీయ రహదారి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం, పరిసర ప్రాంతాల్లో ఎకరా రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల వరకు పెట్టి కొనుగోలు చేసి ప్లాట్లుగా వేస్తున్నారు. పుట్టపర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసుల నుంచి డిమాండు అధికమవుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తున్నారు. అక్కడా ప్లాట్లు వేశారు. దీంతో ఆ రెండు ప్రాంతాల్లో వాటి అమ్మకాలు మాత్రమే పెరిగాయి. సెంటు రూ.5లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ధర పలుకుతోంది.
