దుమ్ముగూడెం-శ్రీశైలం మార్గంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్
Published: Monday July 01, 2019

దుమ్ముగూడెం లేదా తుపాకుల గూడెం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు మార్గంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తీసుకెళ్లాలంటే ఏకంగా 80 కిలోమీటర్ల మేర ఈ రిజర్వ్ ఫారెస్టును దాటాల్సిందే! ఇక్కడ కాల్వలు ఏర్పాటు చేసినా.. టన్నెల్స్ చేపట్టినా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో, టైగర్ రిజర్వ్ ఫారె్స్టను దాటి గోదావరి జలాలను తీసుకెళ్లడం అంత సులువైన అంశం కాదని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. గోదావరిలో ఏ ప్రాంతం నుంచి నీటిని లిప్టు చేసి శ్రీశైలం తరలించాలన్నా.. కచ్చితంగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమస్యను అధిగమించాల్సిందేనని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే ఒక నిర్ణయానికి రావడానికి వీలవుతుందని చెబుతున్నారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించాలని ఈనెల 28న ప్రగతి భవన్లో నిర్వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.
సంబంధిత ప్రతిపాదనలను జూలై 15వ తేదీలోపు రెండు రాష్ర్టాల ఇంజనీర్లు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. దాంతో, వారు కసరత్తు మొదలు పెట్టారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్ల కమిటీ పని చేయనుంది. ఈ కమిటీలో అంతర్రాష్ట్ర జల విభాగం చీఫ్ ఇంజనీర్ నర్సింహారావు, నాగార్జున సాగర్, సీతారామ ప్రాజెక్టుల సీఈలు, హైడ్రాలజీ సీఈతోపాటు రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి, వెంకట్రామారావు తదితరులు ఉన్నారు. కమిటీ చర్చల్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దుమ్ముగూడెం లేదా ఖమ్మం జిల్లాలోని మరో ప్రాంతం నుంచి గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలంటే కచ్చితంగా 80 కిలోమీటర్ల టైగర్ రిజర్వ్ ఫారె్స్టను దాటాల్సి ఉంటుంది. ఈ అడవిలో ఓపెన్ కాల్వలు, పంప్హౌ్సల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం అంత సులువైన అంశం కాదు. అంతేనా, ఈ ప్రాంతం ద్వారా నీటిని తరలించాలంటే.. టన్నెల్స్ను తవ్వాల్సి ఉంటుంది. వీటి విషయంలోనూ సాంకేతిక సమస్య తలెత్తుతుందన్న అభిప్రాయాన్ని ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్నారు. టన్నెళ్ల తవ్వకంలో భాగంగా.. ప్రతి మూడు, నాలుగు కిలోమీటర్లకు ఒకచోట మట్టిని పైకి తీసుకు రావడానికి ప్రత్యేకంగా ఆడిట్లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటు టైగర్ రిజర్వ్ ఫారె్స్టలో సాధ్యం కాకపోవచ్చని ఇంజనీర్లు భావిస్తున్నారు. ఇందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు అనుమతించవని అంచనా వేస్తున్నారు.
