టీడీపీ సీనియర్ నేతలపై అసమ్మతిగళం
Published: Saturday June 29, 2019

ఎంత సీనియర్లయితే మాత్రం ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదు. పార్టీ అంటే సొంత ఎస్టేట్లా భావించడం, ఇతర నేతలను తక్కువగా చూడడం కరెక్టు కాదు. ఈ పద్ధతికి ఫుల్స్టాప్ పెట్టాలి. లేకపోతే జిల్లాలో పార్టీ మనుగడ ఉండదు. పది మందిని పోగుచేయలేని నాయకులు మాపై పెత్తనం చేశారు. ఇక అలాంటి పరిస్థితులు ఉంటే పార్టీలో ఇమడలేం...’ అంటూ జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి, పోల్ మేనేజ్మెంట్ వరకు మితిమీరిన జోక్యంతో తమను ఇబ్బందులకు గురిచేశారంటూ ఒకరిద్దరు అభ్యర్థులు టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లేందుకు తాజాగా సిద్ధమవుతున్నారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించినా.. తనకు టిక్కెట్టు ఇవ్వడంలో చివరి వరకు టెన్షన్ పెట్టారంటూ ఓ మాజీ ఎమ్మెల్యే వాపోయారు.
ఇలాంటి సంఘటనలకు కీలక నేతల ప్రమేయం ఉండడమే కారణమంటూ పలువురు నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో కీలక పదవులు నిర్వహించిన ఇద్దరు నేతలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్థిక వ్యవహారాల్లో వివక్షత చూపారని, స్తోమత ఉన్న సదరు నేతలు సైతం పార్టీ నుంచి వచ్చిన ఫండ్ని పంచడంలో వివక్షత చూపడంపైనా పలువురు అభ్యర్థులు మండిపడుతున్నారు. పార్టీలో కీలక పదవిలో ఉన్న జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి.. పార్టీ అధినేతకు తప్పుడు సమాచారం ఇచ్చి జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయంలేకుండా చేశారని, పార్టీ వర్గాలుగా బలహీనపడడానికి కారణమయ్యారంటూ ఓ సీనియర్ నేతపై పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు నిర్వహించిన సీనియర్లు పార్టీ కేడర్ని ఏమాత్రం పట్టించుకోలేదని, పైగా నేతల మధ్య సమన్వయం చేయడంలోనూ సదరు నేతలు విఫలమయ్యారంటూ టీడీపీలో ఓ కాపు సామాజికవర్గ నేత బాహాటంగానే విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో వీరి పెత్తనం కొనసాగుతుందంటే పార్టీలో ఉండేది లేదంటూ సదరు నేత పార్టీ ముఖ్య నేతలకు తేల్చిచెప్పినట్టు ప్రచారం సాగుతోంది.
