వైసీపీ వాళ్లనే పెట్టుకొంటాం

యానిమేటర్లకు ప్రారంభంలో రూ.200 ఇచ్చేవారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వారి వేతనం రూ.10 వేలకు ఒక్కసారిగా పెరిగింది. దానితోపాటు, ఈ ఉద్యోగానికి డిమాండూ పెరిగింది. ఈ నేపథ్యంలో తనను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారంటూ ఓ యానిమేటర్ కడప జిల్లాలో గురువారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాధితుల కథనం ప్రకారం, కడప జిల్లా చాపాడు మండలం లక్ష్మీపేటకు చెందిన పాతకోట శ్రీనివాసులరెడ్డి ‘వెలుగు’లో యానిమేటర్గా 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం నుంచి ఆయన భార్య రాధాదేవి కూడా ఇదే మండలం కేతవరం యానిమేటర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల వేతనాలు పెంచిన నేపథ్యంలో, యానిమేటర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ శ్రీనివాసులరెడ్డిని వైసీపీ నాయకులు వేధిస్తున్నారు. వారి బెదిరింపులను తట్టుకోలేక గురువారం శ్రీనివాసులరెడ్డి పురుగులమందు తాగాడు. ప్రస్తుతం మైదుకూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘‘ఉద్యోగానికి రాజీనామా చేయాలని చాపాడు మండల వైసీపీ నాయకులు నారాయణరెడ్డి, జయరాజ్ బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి చెప్పుకుంటానని వారి వద్ద ప్రాధేయపడ్డాను. అయినా వారు వినలేదు. ‘మా ముఖ్యమంత్రి జీతాలు ఇస్తున్నాడు.. మా కార్యకర్తలనే పెట్టుకుంటాం. నువ్వు రాజీనామా చెయ్..లేకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు’’ అని బాధితుడు వాపోయాడు.
