విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశం
Published: Tuesday June 04, 2019

ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించలేదు. విచారణ అధికారుల ముందు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన వెకేషన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని ఆయనకు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఈ కేసు మెరిట్స్ ప్రకారం పరిశీలించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ముందస్తు బెయిల్ నిమిత్తం రవిప్రకాశ్ పెట్టుకున్న పిటిషన్ను వాస్తవాలు, పరిస్థితులకు అనుగుణంగా హైకోర్టు పరిశీలించలేదని భావిస్తున్నాం. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును, ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నాం. సాంకేతికాంశాల ఆధారంగా కాకుండా వాస్తవ పరిస్థితులను బట్టి కేసును హైకోర్టు తాజాగా వినాలి. ఇందునిమిత్తం పిటిషనర్ కొత్తగా పిటిషన్ వేసుకోవచ్చు.
చట్టాన్ని అనుసరించి, అన్ని పక్షాల వాదనలూ విని, అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించి, ఈ నెల 10నే మెరిట్స్ ప్రకారం హైకోర్టు దీన్ని తేల్చేయాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. ఆలోపు ఇప్పటికే జారీ చేసిన 41(ఏ) నోటీసుల మేరకు రవిప్రకాశ్ విచారణకు హాజరై, అధికారులకు సహకరించాలని ఆదేశించింది. ఒకవేళ ఆయనను అరెస్టు చేయాలనుకుంటే 48 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 72 గంటల గడువివ్వాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. కాగా, ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడ్డారని, వాటాలపై తప్పుడు పత్రాలను సృష్టించారని చెప్పారు. రవిప్రకాశ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఎఫ్ఐఆర్లో ఏ2గా ఉన్న సినీనటుడు శివాజీకి రవిప్రకాశ్ 40 వేల షేర్లు విక్రయించారని తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక కంపెనీ తరఫున వాదిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. వాదనలు విన్న ధర్మాసనం ముందస్తు బెయిల్ను తాము మంజూరు చేయబోమని స్పష్టం చేస్తూ కేసును హైకోర్టుకే తిప్పి పంపింది.
