మళ్లీ బ్యాలెట్ పేపర్లే శరణ్యం
Published: Monday April 15, 2019

ఈవీఎంలకు అనుసంధానించే వీవీప్యాట్ స్లిప్పులను ప్రతి నియోజకవర్గంలో 50 శాతం చొప్పున లెక్కించాల్సిందేనని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించారు. ఈ డిమాండ్తో బీజేపీ మినహా 15 ప్రాంతీయ పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఏకీభవిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ఓటర్లలో విశ్వాసం, విశ్వసనీయత తీసుకురావడమే తన లక్ష్యమని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు చెప్పారు. ఆదివారమిక్కడి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎన్డీయేతర ప్రతిపక్షాలతో ఆయన సమావేశమయ్యారు.
కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ (కాంగ్రెస్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్-ఢిల్లీ సీఎం), సురవరం సుధాకర్రెడ్డి (సీపీఐ), నీలోత్పల్ బసు (సీపీఎం), త్రిపాఠి (జేడీఎస్), సురేంద్రసింగ్ (సమాజ్వాదీ) తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణతో పాటు ఈవీఎంల వైఫల్యం, వీవీప్యాట్ల లోపాలపై గంటసేపు చర్చించారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరగాలన్న డిమాండ్ను పూర్తిగా సమర్థించారు. అనంతరం ఆయా పార్టీల నాయకులతో కలసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వీవీప్యాట్ స్లిప్లలో ఓటరు పేరు, ఓటు వేసిన పార్టీ గుర్తు 7 సెకన్లు కనిపించాల్సి ఉండగా 3 సెకన్లే కనిపించే వీడియో క్లిప్పింగ్ను ప్రదర్శించారు. నవ్యాంధ్రలో ఎన్నికలు ముగిశాయని, ఇక ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలలో ఈవీఎం లోపాలపై అందరినీ అప్రమత్తం చేయడానికే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశానని చంద్రబాబు వెల్లడించారు.
