అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి
Published: Tuesday March 19, 2019

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. నేలపాడులో కొత్తగా నిర్మించిన జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవనంలో హైకోర్టు సోమవారం నుంచి విధులు ప్రారంభించింది. న్యాయవాదులు, చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలిరావడంతో కోర్టు ప్రాంగణం సందడిగా కనిపించింది. తొలిరోజు కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు విధుల కంటే గంట ముందుగానే భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్తోపాటు మిగిలిన న్యాయమూర్తులకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, నేలపాడు గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. భవన సముదాయంలో ఏర్పాటైన హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, మహిళా న్యాయవాదల అసోసియేషన్ హాళ్లను ప్రధాన న్యాయమూర్తి లాంఛనంగా ప్రారంభించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు రామన్నదొర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు నిర్మిత భూముల యజమానులను సీజే చేతుల మీదుగా సన్మానించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువలతో సత్కరించారు. అనంతరం న్యాయమూర్తులు, ఏజీ తదితరులంతా తమకు కేటాయించిన చాంబర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను సీజే ప్రవీణ్కుమార్ ప్రారంభించారు.
