విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సోదాలు

నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావు ఐదు రోజుల క్రితమే బదిలీపై వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు బొబ్బిలి నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఈ నెల 15న విధుల్లో చేరారు. అంతలోనే ఏసీబీ దాడులు జరగడం నర్సీపట్నంలో కలకలం సృష్టించింది. విశాఖలోని ఆయన ఇల్లు, ఆస్తులు.. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అతని తండ్రి, పలాస మండలం బ్రాహ్మణతర్లాలో అతని మామగారిళ్లలోనూ సోదాలు జరిగాయి. బొబ్బిలిలో ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఉదయాన్నే నర్సీపట్నం చేరుకున్నారు.
శంకరరావును మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి... అక్కడ కమిషనర్కు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 1988లో పురపాలికశాఖలో హెల్త్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన శంకరరావు తదనంతరం పదోన్నతిపై శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. 2008లో గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్గా నెల్లిమర్ల, బొబ్బిలిలో విధులు నిర్వహించారు. నర్సీపట్నంలో ఐదు రోజుల క్రితమే విధుల్లో చేరారు. ఆయన నివసిస్తున్న లాడ్జిలో ఎప్పటి నుంచి ఉంటున్నది, అడ్వాన్స్గా ఎంత చెల్లించారని లాడ్జి మేనేజర్ను ప్రశ్నించారు. ఈ మేరకు మేనేజర్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అదే సమయంలో కమిషనర్కు టిఫిన్ తీçసుకొచ్చిన మధును కూడా ప్రశ్నించారు. అనంతరం ఏసీబీ సీఐ గణేష్ విలేకరులతో మాట్లాడుతూ కమిషనర్ శంకరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినల్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. నర్సీపట్నంలో జరిపిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు ఇతర రికార్డులు లభించాయన్నారు. కమిషనర్ శంకరరావును కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం తరలించారు. అతడిని అరెస్ట్ చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
