అగ్రిగోల్డ్ బాధితుడు మృతి
Published: Monday January 21, 2019

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుడు మహంతి నారాయణప్పడు(70) డిపాజిట్ సొమ్ము రాదేమోననే ఆందోళనతో గుండెపోటుకు గురై ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. నారాయణప్పడు తన జీవిత కాలంలో కష్టపడిన సొమ్మంతా వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తుందనే ఆశతో అగ్రిగోల్డ్లో దాచుకున్నాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా అగ్రిగోల్డ్ లావాదేవీలు నిలిపివేయడంతో ఆందోళన చెందాడు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము దక్కుతుందో, లేదోననే భయంతో అనారోగ్యానికి గురయ్యాడు. అదే బాధతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. అగ్రిగోల్డ్లో పెట్టిన డబ్బులపై బెంగతో నిరంతరం ఆందోళన చెందేవాడని కుటుంబ సభ్యులు వాపోయారు.
