ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు వదంతులు
Published: Wednesday January 16, 2019

సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల హైదరాబాద్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అనవసర సంబంధాలు అంటగట్టి ప్రచారం చేస్తున్నారని.. ఈ వేధింపులు భరించలేకపోతున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 ఎన్నికల ముందు నుంచి సినీ హీరో ప్రభా్సతో తనకు సంబంధం ఉందనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో కొంతమంది పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలం ఈ అసత్య ప్రచారం ఆగిందన్నారు. ఇపుడు మళ్లీ ఎన్నికలు రావడంతో తిరిగి దుష్ప్రచారానికి పూనుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రచారం చేస్తున్న వారితోపాటు చేయిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేకపోవడంతోనే హైదరాబాద్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సోమవారం ఈ మేరకు ఆమె హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 67 ఐటీ చట్టం-2000, 509 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ దుష్ప్రచారం వెనక టీడీపీ హస్తం ఉందన్నారు.
‘‘ఓ భార్యగా, తల్లిగా, చెల్లిగా, నా నైతికతను, నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు, నా దేవుడికి తెలుసు. కానీ, నా గౌరవాన్ని కాపాడుకునే అవసరముంది కాబట్టి ముందుకొచ్చి చెబుతున్నా. ప్రభా్సకు, నాకు ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేదని నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. నాపై తప్పుడు ప్రచారాలు చేసేవారు ఇలా ప్రమాణం చేసి చెప్పగలరా?’’ అని షర్మిల నిలదీశారు. టీడీపీ ఈ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అబద్ధాన్ని 100 సార్లు చెప్పి, దాన్ని నిజమని చూపాలనుకోవడమే టీడీపీ సిద్ధాంతమన్న ఆమె.. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఆ పార్టీ నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
