జమ్మలమడుగు జగడం.. సీఎం వద్ద పంచాయితీ!

Published: Friday January 04, 2019
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు చర్చలు జరిగాయి. బయట ప్రత్యర్ధులుగా పేరుపడిన ఆ నేతలు తెలుగుదేశం అధినేత ముందు బుద్ధిగా కూర్చున్నారు. చివరకు రాజీ మాత్రం కుదరలేదు. ఇద్దరూ కలిసి ఒక మాట చెప్పమని అడిగితే.. "మీరేం చెబితే దానికే కట్టుబడి ఉంటాం'' అని బంతిని ముఖ్యమంత్రి కోర్టులోకే నెట్టారు. "రెండు రోజుల్లో మీరే తేల్చుకుని చెబితే బాగుంటుంది'' అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. రెండు రోజులు గడిచినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడు ఏమి జరుగుతుందనేదే అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఆ ప్రత్యర్ధులు ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఎందుకు పంచాయితీ జరిగింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
 
 
    హత్యలు- ప్రతీకార హత్యలతో రగిలిన నియోజకవర్గం అది. అంత తేలికగా రాజీపడే మనస్తత్వాలు కూడా కాదు అక్కడివారివి! ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా? ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆ ప్రత్యర్థుల కథ కూడా అలాగే ఉంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అనేగా మీ సందేహం! కడప జిల్లాలోని జమ్మలమడుగు!! అక్కడున్న నేతలు ఎవరో తెలుసా? ఒకరు రాష్ట్రమంత్రి ఆదినారాయణరెడ్డి. మరొకరు మాజీమంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. వీరిరువురు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రమే! ఒకరంటే మరొకరికి పొసగడం లేదు. అనేకసార్లు కీచులాటలు కూడా జరిగాయి. పార్టీ పెద్దలు ఎన్నిసార్లు సర్ధిచెప్పినా ఫలితం కనిపించలేదు.
 
 
    సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో జమ్మలమడుగు జగడం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. తనవద్ద ఇద్దరు నేతలతో సిటింగ్‌ ఏర్పాటుచేశారు. ఈ భేటీలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డితోపాటు సీఎం రమేష్, టీడీ జనార్ధన్ పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పంచాయితీ జరిగింది. అయినా విషయం మాత్రం తేలలేదు. "మీరిద్దరూ ఒక అంగీకారానికి రావాలి'' అని ముఖ్యమంత్రి పదేపదే చెప్పారు. అయినప్పటికీ వారు మాత్రం ఏకీభావానికి రాలేదు.
 
 
    ఈ పంచాయితీలో చంద్రబాబు ఓ సీరియస్‌ ప్రతిపాదన చేశారు. ఇద్దరిలో ఒకరు జమ్మలమడుగు నుంచి అసెంబ్లీకి పోటీచేయడం. మరొకరు కడప ఎంపీగా బరిలోకి దిగడం. ఎవరు ఎక్కడినుంచి పోటీచేయాలనే అంశంపైనే అర్ధరాత్రి వరకూ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి కానీ, రామసుబ్బారెడ్డి కానీ తమ అభిప్రాయం చెప్పలేదు. దీంతో "మీరు కూర్చుని తేల్చుకుంటే బాగుంటుంది. నేను చెప్పడం మంచిది కాదు'' అని చంద్రబాబు వీరిని మొహమాట పెట్టారు! అయినా అది జమ్మలమడుగు రాజకీయం కదా? ఇద్దరు నేతలు రాత్రి మూడు గంటల వరకూ కూర్చున్నారు.. కానీ అసలు విషయంపై స్పష్టతకి రాలేదు. చివరకి "మీరే తేల్చండి..'' అని తాపీగా చెప్పారు. తాను కడప ఎంపీగా పోటీచేయాలంటే అందుకు తనవర్గం వారు ఒప్పుకోవాలనీ, పైగా తన సోదరులకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందనీ ఆదినారాయణరెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. వారందరినీ మీరు ఒప్పిస్తే నాకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. కావాలంటే తనవారందరినీ తీసుకుని వస్తానని ఆదినారాయణరెడ్డి అన్నారు. అంతేకాదు- "ఎంపీగా నేను పోటీచేస్తే అన్ని మీరే చూసుకోవాలి'' అని కూడా నర్మగర్భంగా ఓ మాట వేశారు.
 
 
   చివరాఖరికి చెప్పొచ్చేదేమంటే.. జమ్మలమడుగు పంచాయితీ తేలలేదు. తెల్లవారుజామున 3 గంటల వరకూ ఈ పీటముడి కొనసాగింది. అప్పటికి అందరికీ నిద్ర ముంచుకొస్తుండటంతో "రెండు రోజుల్లో మాట్లాడుదాం'' అని చెప్పి అందరూ లేచారు. "మంచి నిద్ర సమయంలో కలిసి కూర్చుని చర్చించుకుంటే ఎవరో ఒకరు ఒప్పుకుంటారని చంద్రబాబు భావించారు. కానీ అవి ఫ్యాక్షన్ జోన్ పాలిటిక్స్‌ కదా.. అక్కడి నేతలు అంత తేలికగా ఒప్పుకుంటారా?'' అని ఒక తెలుగుదేశం నేత ఈ భేటీ గురించి వ్యాఖ్యానించారు. మరో రెండు రోజుల్లో జమ్మలమడుగు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!