పవిత్ర సంగమంలో స్టాకు యార్డు రెడీ
Published: Saturday December 29, 2018

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ వంతెన పనులకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం నుంచి రాజధాని ప్రాంతంలోని తాళ్లాయిపాలెం వరకు కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ పనులను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) పర్యవేక్షిస్తుంది. 3.2 కిలోమీటర్ల మేర ఆరు వరసలుగా దీనిని నిర్మిస్తారు. జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
పవిత్ర సంగమం వద్ద శిలాఫలకాన్ని గోదావరి ఘాట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం స్టాకు యార్డును ఇప్పటికే సిద్ధం చేశారు. నదిలో పిల్లర్లు(పైల్స్) వేసేందుకు అవసరమైన అతిపెద్ద ఐరన్ ఫంట్స్(బార్జ్లు) సిద్ధం చేసి నదిలోకి దింపుతున్నారు. ఇంజనీర్లు మార్కింగ్ను పూర్తి చేశారు. పైల్ కాంక్రీటుకు మెటీరియల్ త్వరలో వస్తుందని చెబుతున్నారు. నదిలో 36 పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి వంతెన ఉంటుంది. వాస్తవానికి గత ఏడాదే ఈ వంతెన నిర్మాణానికి ఈపీసీ విధానంలో ఏడీసీ టెండర్లు పిలిచింది. అయితే నిర్మాణ వ్యయాన్ని రూ.1432 కోట్ల నుంచి రూ.1349 కోట్లకు తగ్గించడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిర్మాణ వ్యయం రూ.86 కోట్ల మేర తగ్గించి తిరిగి టెండర్లను పిలవగా ఎల్అండ్టీ పనులు దక్కించుకుంది. ఆరు డిజైన్లను ఈ సంస్థ ఇంజనీర్లుకు సీఎంకి చూపగా వాటిలో కూచిపూడి నాట్యభంగిమను తలపించే డిజైన్కు ఆమోద ముద్ర వేశారు.
అమరావతికి ఐకానిక్ మార్గం!
ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ వైపు నుంచి అమరావతికి చేరుకునేందుకు చాలా సమయం ఆదా అవుతుంది. 65వ నంబరు జాతీయ రహదారిలో ఇబ్రహీంపట్నం నుంచి కేవలం 3.2 కిలోమీటర్లు వంతెనపై ప్రయాణిస్తే రాజధానికి చేరుకోవచ్చు. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతవాసులకూ రాజధానితో అనుసంధానం మరింత పెరుగుతుంది. విజయవాడపై ట్రాఫిక్ ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది.
