2024లో తానే ప్రధానినంటూ భక్తులకు బిల్డప్
Published: Tuesday December 25, 2018

‘గట్టిగా అనుకో అయితదిలే...’ ఫిదా సినిమాలో హీరోయిన్ డైలాగ్ ఇది! భక్తులను నమ్మించేందుకు ఆ దొంగ స్వామి ఈ మాటనే నమ్ముకున్నాడు! ‘గట్టిగా అనుకోండి.. కోరుకున్నది అయిపోతుంది’ అని నమ్మించాడు. ‘అమెరికాకు బిల్గేట్స్ ఎలాగో.. భారత్కు నేనూ అలాగే’ అని చెప్పేవాడు. 2024లో ప్రధానమంత్రి అవుతానని భక్తులతో చెప్పుకొన్నాడు. స్వామీజీ ముసుగులో తన మాట చాతుర్యంతో భక్తులకు ప్రవచనాలను చెబుతూనే వారి దృష్టిలో తన స్థాయినీ పెంచుకుంటూ మాయ చేశాడు. ప్రవచనాలు, పెట్టుబడి పేరుతో వారి నుంచి ఏడాదిలోనే ఏకంగా రూ.60కోట్లు దోచాడు. ఆ డబ్బుతో విదేశాలకు వెళ్లి జల్సా చేశాడు.
రోల్స్ రాయిస్, హమ్మర్, జాగ్వార్ వంటి ఖరీదైన కార్లు కొన్నాడు. హైదరాబాద్ కేంద్రంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట వాస్తవ్యుడు ఈకే గిరీశ్ సింగ్ లీలలివీ!! ఎట్టకేలకు పాపం పండడంతో పోలీసులకు చిక్కాడు. ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో జాయింట్ సీపీ సుధీర్బాబు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో గిరీశ్.. సూళ్లూరుపేటలోని అమ్మమ్మవాళ్ల దగ్గర పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఇంటి పక్కన ఉన్న ‘శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి’ గుడికి వెళ్లడంతో కొద్దిగా ఆధ్యాత్మిక జ్ఞానం అబ్బింది. నెమ్మదిగా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పడం, ఉపన్యాసాలివ్వడం అలవాటు చేసుకున్నాడు. కొన్నాళ్లకే వివిధ టీవీల్లో, యూట్యూబ్లో అతడి ప్రవచనాలు, ఉపన్యాసాలు బాగా పాపులర్ అయ్యాయి. అప్పటి నుంచి అద్వైత క్రియ స్వామిజీగా చలామణి అయ్యాడు. తనకు బాలాత్రిపుర సుందరీదేవి స్వయంగా దర్శనమిచ్చిందని, తాను కోరుకున్నది కచ్చితంగా నెరవేరేలా వరం ఇచ్చిందని భక్తులను నమ్మించేవాడు. తనను ఆశ్రయించే భక్తులకు క్లాసులు చెప్పేందుకు అద్వైత స్పిరుచువల్ రీచార్జి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(ఏఎ్సఆర్సీఈ) అనే కేంద్రాన్ని స్థాపించాడు.
భక్తుల సమస్యలను బట్టి.. కుబేర ప్రక్రియ, అమృత ప్రక్రియ, ధన్వంతరీ ప్రక్రియ, కల్యాణ ప్రక్రియ, సంతాన ప్రక్రియ పేర్లతో క్లాసులు తీసుకునేవాడు. క్లాసుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు మొదలు రూ.2లక్షలు తీసుకునేవాడు. కాగా, భక్తుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసిన గిరీశ్ వద్ద రూ.కోట్లు జమయ్యాయి. ఇంకా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు పలు రకాల వ్యాపారాల పేరుతో మల్లీలెవల్ మోసాలకు పాల్పడాలని ప్లాన్ చేశాడు. డ్రిమ్ బ్రిడ్జ్ సోషల్ ట్రేడ్, గిరీశ్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, ఎయిర్ లైన్ గోల్డ్, అండ్ డైమండ్ బిజినెస్ ఇలా 30 స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి డైరెక్టర్లుగా తన భార్య దివ్యను, తమ్ముడిని నియమించాడు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే 3 నుంచి 6నెలల్లోనే కోటీశ్వరులు కావొచ్చంటూ నమ్మించాడు. తన వద్ద రూ. 1100 నుంచి రూ. 66వేల వరకు వివిధ రకాల యూజర్ ఐడీలు ఉన్నాయని.. ఒక్కో ఐడీ కొనుగోలు చేసిన వారు వారికింద ఇద్దరు వ్యక్తులను చేర్పించాలని నిబంధన పెట్టాడు. వారు ఒక్కొక్కరు మరో ఇద్దరిని చేర్పించాలి. ఇలా చేర్పిస్తూ పోతే అధిక మొత్తంలో కమీషన్ ఇస్తానని.. 10వ లెవల్కు వెళ్లేసరికి రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తికి రూ. కోటి ఆదాయం వస్తుందని నమ్మించాడు. అప్పటికే అతడి మాయలో పడిపోయిన భక్తులు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొందరైతే రూ.2 నుంచి 4కోట్ల వరకూ ముట్టజెప్పారు. ఇలా ఏడాదిలోనే భక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా రూ. 60 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
