పెథాయ్ తీవ్రతకు కుంగిన ప్లాట్ఫామ్
Published: Saturday December 22, 2018

తీరం తాకే సమయానికి బలహీనపడిన ‘పెథాయ్’ తుఫాను... సముద్రంలో ఉండగా ఓ భారీ ‘విధ్వంసం’ సృష్టించింది. కాకినాడ తీరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న ఓఎన్జీసీ రిగ్ ‘బేస్మెంట్’ పెథాయ్ తీవ్రతకు కదిలిపోయింది. రిగ్ పూర్తిగా ఒకవైపునకు పూర్తిగా ఒరిగిపోయింది! దీనివల్ల ఎంత నష్టం జరిగింది, రిగ్ పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందనే విషయాలపై ఓఎన్జీసీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
బ్రెజిల్కు చెందిన చమురు వెలితీత సంస్థ క్యూజీఓజీకి చెందిన ‘ఒలిండా స్టార్’ రిగ్ను ఓన్జీసీ ఈ ఏడాది జనవరిలో లీజుకు తీసుకుంది. దీనికి సముద్రగర్భంలో 600 మీటర్లలోతు వరకు డ్రిల్ చేసే సామర్థ్యం ఉంది. పెథాయ్ తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందన్న అంచనాల నేపథ్యంలో ఓఎన్జీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రిగ్లో పనిచేసే ఇంజనీర్లు, సిబ్బంది మొత్తం 120 మంది ఈనెల 16నే తీరానికి వచ్చేశారు. తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ... చలిగాలులు ఎక్కువగా ఉండటంతో తిరిగి అక్కడికి వెళ్లలేదు. 2 రోజుల కిందట ఓఎన్జీసీ సిబ్బంది హెలికాప్టర్లో రిగ్ వద్దకు వెళ్లగా... అది పూర్తిగా ఒకవైపునకు ఒరిగిపోయి ఉం డటం కనిపించింది. హెలికాప్టర్ను దించే అవకాశం కూ డా లేకపోవడంతో వెనుతిరిగి వచ్చేశారు. గురువారం సిబ్బంది పడవ ద్వారా రిగ్ వద్దకు చేరుకున్నారు. అలల తీవ్రత ఎక్కువ ఉండటంతోపాటు, రిగ్పైకి వెళ్లే మార్గమేదీ కనిపించక వెనక్కి వచ్చేశారు.
రిగ్కు జరిగిన నష్టం ఎంత, పునరుద్ధరణ చర్యలు ఎలా... దీనిపై స్పష్టత రావాలంటే రిగ్పైకి వెళ్లి పరిశీలించాల్సిందే. దీనికోసం ఓఎన్జీసీ విశాఖ తూర్పు నౌకాదళ అధికారుల సహాయం తీసుకుంది. నేవీ సిబ్బంది రంగంలోకి దిగారు. శుక్రవారం యూహెచ్ 3హెచ్ హెలికాప్టర్ ద్వారా 13 మంది ఓఎన్జీసీ ఇంజనీర్లు, విదేశీ నిపుణులను రిగ్ వద్దకు తీసుకెళ్లారు. తొలుత ఇద్దరు నేవీ మార్కోస్(కమెండో)లు రిగ్ డెక్పైకి దిగా రు. ఆ తర్వాత ఓఎన్జీసీ నిపుణులు, ఇంజనీర్లను ఒకొక్కరిగా డెక్పైకి క్షేమంగా దించారు. ఇది సెమీ సబ్ మెర్సిబుల్ రిగ్. సముద్ర ఉపరితలంపై ‘బార్జ్’పైన ఏర్పాటు చేశారు. భారీ గాలులకు రిగ్ యాంకర్లలో ఒకటి పక్కకు జరగడం లేదా... యాంకర్ మూరింగ్ విరగడంవల్లే రిగ్ ఒరిగి ఉంటుందని భావిస్తున్నారు. నష్టం భారీగా ఉండకపోవచ్చునని ఓన్జీసీ అధికారులు చెబుతున్నారు. వదంతులను నమ్మవద్దని ఎంపీ రవీంద్రబాబు కోరారు..
